పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: మంత్రి కందుల
రాష్ట్రంలో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా వినూత్న కార్యక్రమాలు, మెగా, జిల్లా స్థాయి ఈవెంట్లను నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్లో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన టూరిజం డిపార్ట్మెంట్ మార్కెటింగ్ కమిటీ ప్రమోషన్ మీటింగ్ లో ఏడాదంతా పర్యాటక శోభ ఉట్టిపడేలా జిల్లా స్థాయి పర్యాటక ఉత్సవాలు, రోడ్షోలు నిర్వహించాలని,జిల్లాల నుండి అందిన 28 ప్రతిపాదనలకు అనుగుణంగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఉత్సవాలకు రూపకల్పన,. సెప్టెంబర్ 27న 'వరల్డ్ టూరిజం డే' వేడుకల నిర్వహణ, రాబోయే గోదావరి పుష్కరాలకు విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు, భక్తుల సౌకర్యార్థం పర్యాటక శాఖ తరఫున అత్యాధునిక టెంట్ సిటీల ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గోదావరి పుష్కరాలు-2027 సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దేశవిదేశాల నుంచి తరలివచ్చే కోట్లాది మంది భక్తులు, పర్యాటకుల కోసం రూపొందించిన విస్తృత స్థాయి బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యాచరణను అధికారులు మంత్రి దుర్గేష్ కు అందించారు. యాత్రికుల సౌకర్యార్థం పిలిగ్రిమ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, సర్క్యూట్ మ్యాప్స్, ఆకర్షణీయమైన బ్రోచర్లు, సమగ్ర వివరాలతో కూడిన కంటెంట్ తయారు చేయాలని సూచించారు. గోదావరి నది ప్రాశస్త్యాన్ని,పరివాహక అధ్యాత్మిక ప్రాంతాల ప్రాధాన్యతను, చారిత్రక ఘాట్ల విశిష్టతను చాటేలా వినూత్న డిజిటల్ కంటెంట్, సోషల్ మీడియా ప్రచారాలు, స్టోరీ టెల్లింగ్ కార్యక్రమాలు రూపొందించాలన్నారు. టూర్ ఆపరేటర్లతో ప్రతి నెలా క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడం, హోటల్ అండ్ హాస్పిటాలిటీ వర్క్షాప్ల ఏర్పాటుపై అధికారులు సూచించగా మంత్రి దుర్గేష్ సానుకూలంగా స్పందించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్. రావత్, టూరిజం ఎండీ పట్టాన్ శెట్టి రవిసుభాష్, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్, సినిమాటోగ్రఫీ ఎండీ విశ్వనాథన్, ఏపీటీఏ సీఈవో శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లిఖార్జునరావు, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ విజయలక్ష్మి, చీఫ్ మార్కెటింగ్, ఫైనాన్స్ అధికారులు పద్మారాణి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.