దాసరి నారాయణరావు మార్గంలోనే మా ప్రయాణం: నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC) ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికల బరిలో నిలిచిన 'మన ప్యానెల్' ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన కీలక ప్రెస్ మీట్లో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడారు. నిత్యం సినిమాలు చేస్తూ, పరిశ్రమ సమస్యలపై అవగాహన ఉన్న సభ్యులతో ఎన్నికల బరిలో దిగామని తెలిపారు. దివంగత ప్రముఖ దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణరావు సిద్ధాంతాలను, ఆయన అడుగుజాడలను తాము స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సహకరించిన బండ్ల గణేష్కు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి నిర్మాత రైతులా శ్రమిస్తాడని, నిర్మాతల సంక్షేమం కోసం నామినేషన్లు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
ఇదే సమయంలో ప్రత్యర్థుల ఆరోపణలపై చదలవాడ శ్రీనివాసరావు స్పందిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ఎంతో హుందాగా ఎన్నికల ప్రచారం చేస్తుంటే, అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి తమపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆయన నామినేషన్ను తామే కావాలని వెనక్కి వెళ్లేలా చేశామని అనడం పూర్తిగా అవాస్తవమని, నిబంధనలు పాటించకపోవడం వల్లే ఆయన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. అనుభవం లేకపోవడం వల్ల ఆయన ఒకే వ్యక్తి మూడు నామినేషన్లు వేయడం వల్లే నిబంధనల ప్రకారం అనర్హులయ్యారని స్పష్టం చేశారు.
ఇతర ప్యానెళ్లలోనూ ఎక్కువ నామినేషన్లు వేసినా వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్లారని, కానీ నిబంధనలు పాటించని వారి వల్ల పరిశ్రమకు ఒరిగేదేమీ లేదని తేల్చిచెప్పారు. పదవులు కేవలం ప్రదర్శనలకోసం, ముఖ్యమంత్రులు లేదా ప్రజల దృష్టిలో పడటానికి కాదని, నిజంగా సినిమా ఇండస్ట్రీకి అండగా నిలిచే నాయకత్వం కావాలని అన్నారు. పరిశ్రమ అభివృద్ధి కోసం శ్రమించే తమ 'మన ప్యానెల్'ను గెలిపించాలని, నిర్మాతలందరికీ మెరుగైన పాలన అందిస్తామని ఆయన పిలుపునిచ్చారు.