అంబేద్కర్పై అవహేళనకు పాల్పడితే సహించం. డీబీపీ జాతీయ అధ్యక్షుడు కృష్ణస్వరూప్
అసత్య ప్రచారాలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
తెలంగాణ బ్యూరో ప్రతినిధిః భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్పై అవహేళనకు, అసత్య ప్రచారానికి పాల్పడటం అత్యంత దారుణమని దళిత బహుజన పార్టీ (డీబీపీ) జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ అన్నారు. అంబేద్కర్ను కించపరిచేలా జరుగుతున్న ప్రచారం వెనుక ఆర్ఎస్ఎస్ నాయకత్వం హస్తం ఉందన్న ఆరోపణలపై ఆ సంస్థ అధినేత మోహన్ భగవత్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పౌర సమాజానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవ హక్కులకు రాజ్యాంగం ద్వారా బలమైన పునాది వేసిన మహనీయుడు అంబేద్కర్ అని కృష్ణస్వరూప్ పేర్కొన్నారు. అలాంటి మహనీయుడిని కుల దృక్కోణంలో చూడటం, ఆయనపై అవమానకరమైన ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్ ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారని, ఆయన జయంతిని అనేక దేశాల్లో వివిధ కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర డీజీపీకి పలు ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. అమరా ప్రసాద్ పేరుతో ప్రచారంలో ఉన్న పుస్తకంలో అంబేద్కర్ను ‘కల్పిత నాయకుడు’గా చిత్రీకరిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ వాదుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, బీజేపీ, బజరంగ్దళ్ తదితర సంస్థలు, వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కృష్ణస్వరూప్ కోరారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎన్ఎస్ఎల్ఓ జాతీయ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది పి. పద్మారావు, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్స్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. రాజలింగం, దళిత బహుజన పార్టీ నగర నాయకుడు ఎం. స్వామిదాస్, మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రాయప్ప తదితరులు పాల్గొన్నారు.