andhrapradesh
వెలిగొండపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు
వెలిగొండపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు
- వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి
- వైసీపీ నేతలకు శ్యామల కాశిరెడ్డి హెచ్చరిక
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
వెలిగొండ ప్రాజెక్టుపై వైసీపీనాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఇకపై సహించేది లేదని ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి హెచ్చరించారు. వెలిగొండ ప్రాజెక్టును తామే పూర్తి చేశామని వైసీపీ నేతలు చెప్పడం వాస్తవాలను వక్రీకరించడమేనన్నారు. 1996లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో పనులను వేగవంతం చేసి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని పేర్కొన్నారు. గత రెండేళ్లలో ప్రాజెక్టు కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వెలిగొండ జలాలు అందనున్న ప్రాంతాల రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.
జగన్ మెప్పు కోసం వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని శ్యామల కాశిరెడ్డి విమర్శించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. 2019లో మాగుంటకు వైసీపీ టికెట్ ఇచ్చినప్పుడు ఆయన లిక్కర్ వ్యాపారం గురించి ఆ పార్టీ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. మాగుంట కుటుంబం మూడు దశాబ్దాలుగా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ప్రజలకు సేవలందిస్తోందన్నారు.వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై కూడా శ్యామల కాశిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మద్యం వ్యవహారంలో చిక్కుకుని జైలుకు వెళ్లిన చెవిరెడ్డి, ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు కలిగిన వ్యక్తి అంటూ ఆరోపించారు. చంద్రగిరిలో ప్రజలు తిరస్కరించడంతో ఒంగోలు వచ్చిన చెవిరెడ్డిని ఇక్కడి ప్రజలు కూడా తిరస్కరించారని దీంతో తిరిగి చంద్రగిరి వెళ్లి దందాలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని శ్యామల కాశిరెడ్డి సూచించారు.