శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ సీఈఓగా జితేంద్ర మిశ్రా నియామకంపై ఎన్.రామచందర్ రావు హర్షం
హైదరాబాద్: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తొలి ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా (CEO) రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం కావడం పట్ల తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నియామకాన్ని స్వాగతించారు.
రామచందర్ రావు మాట్లాడిన ముఖ్య అంశాలు... జితేంద్ర మిశ్రా నియామకంతో పాటు ట్రస్ట్ సభ్యులలో చోటుచేసుకున్న మార్పులు రామమందిర నిర్వహణలో మరింత పారదర్శకతను, మెరుగైన పరిపాలనా సౌలభ్యాన్ని తీసుకువస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (Q1) భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు కావడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. 7.8 శాతం వృద్ధి రేటు గణాంకాల లెక్కింపుపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి స్పష్టమైన వివరణ ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఆమోదయోగ్యం కాని లెక్కలను చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పురోగతిని సాధిస్తుంటే ప్రతిపక్షాలు అనవసరమైన గందరగోళం సృష్టిస్తున్నాయని రామచందర్ రావు విమర్శించారు.