గంభీర్కు నచ్చిన ఆటగాళ్లకు మళ్లీ ఛాన్స్.. టీమ్ ఎంపికపై బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు
**న్యూస్ డెస్క్**: గంభీర్కు నచ్చిన ఆటగాళ్లకు మళ్లీ ఛాన్స్.. టీమ్ ఎంపికపై బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు
అఫ్గానిస్తాన్తో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన నేపథ్యంలో జట్టు ఎంపికపై చర్చ మొదలైంది. కొందరు ఆటగాళ్లు పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించకముందే జట్టులో చోటు దక్కించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిల ఎంపికపై సోషల్ మీడియాలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. భారత హెడ్కోచ్ గౌతమ్ గంభీర్కు ఇష్టమైన ఆటగాళ్లకు మరోసారి అవకాశం లభించిందన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు.వాషింగ్టన్ సుందర్కు జట్టు మేనేజ్మెంట్ నుంచి మంచి మద్దతు లభిస్తోందని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. వచ్చిన అవకాశాన్ని సుందర్ పూర్తిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి విషయంలో తన అభిప్రాయం భిన్నంగా ఉందని స్పష్టం చేశాడు.
నితీష్ను తాను పూర్తి స్థాయి ఆల్రౌండర్గా చూడటం లేదని, ప్రధానంగా అతడిని బ్యాటర్గానే పరిగణిస్తానని బద్రీనాథ్ చెప్పాడు. బౌలింగ్ విభాగంలో అతడిని ఆధారపడదగిన ఆటగాడిగా భావించడం లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. గౌతమ్ గంభీర్ మద్దతు కారణంగానే హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు లభిస్తున్నాయనే చర్చ కూడా క్రికెట్ వర్గాల్లో జరుగుతోంది. అయితే జట్టు ఎంపికలో ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్, జట్టు అవసరాలను పరిగణనలోకి తీసుకున్నామని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది.
బుమ్రా రీఎంట్రీపైనా స్పందించిన బద్రీనాథ్. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి టీ20 జట్టులోకి రావడంపైనా బద్రీనాథ్ స్పందించాడు. బుమ్రా రీఎంట్రీ టీమిండియాకు శుభపరిణామమని పేర్కొన్నాడు.
మూడు మ్యాచ్ల సిరీస్ను ఆడేందుకు బుమ్రా స్వయంగా మేనేజ్మెంట్తో మాట్లాడి ఉండవచ్చని, అందుకే అతడిని జట్టులోకి ఎంపిక చేసి ఉండొచ్చని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో బుమ్రా ప్రదర్శనతో పాటు, విమర్శలు ఎదుర్కొంటున్న ఆటగాళ్లు తమ అవకాశాలను ఎలా ఉపయోగించుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.