ఇంధన భద్రత, కార్బన్ మార్కెట్లపై భారత్-జర్మనీ ద్వైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్, జర్మనీ దేశాలు ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాయి. కేంద్ర విద్యుత్, గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్, జర్మనీ ఫెడరల్ పర్యావరణ, వాతావరణ పరిరక్షణ శాఖ మంత్రి కార్స్టెన్ ష్నైడర్తో బుధవారం న్యూఢిల్లీలో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. భారత్-జర్మనీ మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాలు, 25 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యం పూర్తయిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇంధన భద్రత, విద్యుదీకరణ, అల్ప-కార్బన్ (Low-carbon) అభివృద్ధి, కార్బన్ మార్కెట్లు మరియు సరఫరా గొలుసుల (Supply chains) వైవిధ్యీకరణపై ఇరు దేశాల మంత్రులు విస్తృతంగా చర్చించారు. ఇంధన భద్రత మరియు అల్ప-కార్బన్ వృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, సురక్షితమైన, సరసమైన, సుస్థిరమైన ఇంధన భవిష్యత్తును సాధించేందుకు రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు.
రాబోయే నెలల్లో ద్వైపాక్షిక ఉమ్మడి భాగస్వామ్య కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్-జర్మనీల మధ్య పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలకు ఈ సమావేశం మరింత ఊతాన్ని ఇచ్చిందని అధికారులు తెలిపారు.