వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ స్థిరనివాసులు, సైన్యం దాడి
ఇద్దరు పాలస్తీనా యువకులు మృతి
రమల్లా: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో యూదు స్థిరనివాసుల (సెటిలర్లు) హింసాత్మక ఘటనలు తీవ్రమవుతున్న వేళ, బుధవారం రమల్లా సమీపంలోని అల్-ముఘయ్యిర్ గ్రామంపై ఇజ్రాయెల్ స్థిరనివాస మిలిటెంట్లు, సైనిక దళాలు జరిపిన దాడిలో ఇద్దరు పాలస్తీనా యువకులు మరణించారు. మృతుల వయస్సు 16 మరియు 19 సంవత్సరాలని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
ఒక పశువుల కాపరిని రక్షించేందుకు మరియు పోలీసులకు రక్షణ కల్పించేందుకు తమ దళాలు అల్-ముఘయ్యిర్లోకి ప్రవేశించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ క్రమంలో బలగాలపై రాళ్లు విసిరిన "హింసాత్మక ఆందోళనకారులను" అదుపు చేసేందుకు కాల్పులు జరిపామని, ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్నామని సైన్యం పేర్కొంది.
గత ఆగస్టులో ఖుస్రా గ్రామాన్ని సెటిలర్లు ముట్టడించడం అంతర్జాతీయంగా తీవ్ర ఖండనకు గురైంది. ఆ ఘటన మరవకముందే ఈ దాడి జరగడం వెస్ట్ బ్యాంక్లో మరింత ఉద్రిక్తతలకు దారితీసింది.
1967 యుద్ధం తర్వాత స్వాధీనం చేసుకున్న వెస్ట్ బ్యాంక్లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త సెటిల్మెంట్లు, అవుట్పోస్టుల విస్తరణను వేగవంతం చేసింది.
పాలస్తీనా గ్రామాల శివార్లలో సెటిలర్ల ఉనికిని పెంచుతూ, పాలస్తీనియన్ల నిర్దిష్ట భూభాగాలను ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.