ప్రియురాలికి ఐఫోన్ బహుమతి ఇచ్చేందుకు గంజాయి స్మగ్లింగ్
ఖమ్మంలో ప్రేమజంట అరెస్ట్
ఖమ్మం/వైరా: ప్రియురాలి పుట్టినరోజుకు ఖరీదైన ఐఫోన్ బహుమతిగా ఇవ్వాలనే పిచ్చి ఆలోచనతో గంజాయి రవాణాకు పూనుకున్న ఓ ప్రేమజంట పోలీసులకు చిక్కింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా సమీపంలో చోటుచేసుకుంది. ప్రత్యేక 'ఈగల్' (EAGLE) బృందాలు, వైరా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 12 కిలోల గంజాయితో పాటు ఈ జంటను అదుపులోకి తీసుకున్నారు.
పెద్దపల్లి జిల్లాకు చెందిన మిత్ర చైతన్య (21), హేమలత (20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. త్వరలో రానున్న హేమలత బర్త్డేకు ఐఫోన్ కొనిస్తానని వాగ్దానం చేసిన చైతన్య, సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి స్మగ్లర్గా మారాడు.
ఒడిశాలోని పసుపులంక ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై వెళ్లిన ఈ జంట, అక్కడ ఐదు రోజులు మకాం వేసి భగవాన్ హంతాల్ అనే వ్యక్తి వద్ద రూ.16,000 చెల్లించి 12 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. దీనిని హైదరాబాద్లో రూ.6 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం పన్నారు.
గంజాయితో తిరిగి వస్తుండగా వైరా క్రాస్రోడ్డు వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. బైక్ను ఆపకుండా పోలీసు వాహనంపైకి దూకించడంతో వైరా ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. కిందపడటంతో నిందితులకు కూడా గాయాలయ్యాయి.
పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 12 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనంతో పాటు నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు చైతన్యపై గతంలోనూ ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద పెదపల్లి, ఉప్పల్, మేడ్చల్ పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో గంజాయి సరఫరా చేసిన ఒడిశాకు చెందిన భగవాన్ హంతాల్తో పాటు హైదరాబాద్లో దీనిని కొనుగోలు చేయాల్సిన శశి, నాగుల అనే వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.