రేవంత్ రెడ్డికి ధైర్యముంటే మా అమ్మపై పోటీ చేసి గెలవాలి
కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తన తల్లి కొండా సురేఖను తెలంగాణ మంత్రివర్గం నుంచి తొలగించడంపై ఆమె కుమార్తె కొండా సుష్మిత తీవ్రంగా మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నేరుగా రాజకీయ సవాల్ విసిరారు.
"రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే నా తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి ఆమెకు పోటీగా నిలబడి గెలవాలి" అని కొండా సుష్మిత సవాల్ విసిరారు. తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగత హోదాలో మాట్లాడినవని, వాటికి తన తల్లిని బాధ్యురాలిని చేస్తూ పదవి నుంచి తొలగించడం ఏమాత్రం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. "నేను రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి, కొన్ని పరిణామాల గురించే మాట్లాడాను. అది కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కానే కాదు. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీకి ఆపాదించడం తప్పు" అని స్పష్టం చేశారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన తల్లికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఆమెను ఈ స్థితిలో చూసి మనస్తాపానికి గురయ్యానని పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని తాను మనస్ఫూర్తిగా శపిస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లికి రాజకీయంగా ఎల్లవేళలా అండగా ఉంటానని, ఆమె గొంతును ఎవరూ నొక్కలేరని కొండా సుష్మిత స్పష్టం చేశారు.