పామాయిల్ ఫ్యాక్టరీలో నవశకం: 9 నెలల్లోనే సరికొత్త రికార్డుల ప్రస్థానం
పామాయిల్ ఫ్యాక్టరీలో నవశకం: 9 నెలల్లోనే సరికొత్త రికార్డుల ప్రస్థానం!
* రైతులకు ఇబ్బంది లేకుండా 10 రోజులు నిర్విరామంగా క్రషింగ్
* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిత్య పర్యవేక్షణ
* ఆగస్టులో మునుపెన్నడూ లేని విధంగా 46,700 టన్నుల దిగుబడి
* పామాయిల్ ఫ్యాక్టరీ మేనెజర్ మందా నాగబాబు..
దమ్మపేట, సూర్య (మేజర్ న్యూస్)
రాష్ట్రంలో పామాయిల్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా, ఫ్యాక్టరీల ఆధునికీకరణ, ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా సరికొత్త విప్లవం నడుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పామాయిల్ ఫ్యాక్టరీ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రైతులకు ఎక్కడా, ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా, ఉన్నతాధికారుల అండదండలతో ఫ్యాక్టరీని ప్రగతి పథంలో నడిపిస్తున్నట్లు ఫ్యాక్టరీ మేనేజర్ మందా నాగబాబు గర్వంగా ప్రకటించారు. తాను బాధ్యతలు చేపట్టిన ఈ 9 నెలల స్వల్ప కాలంలోనే ఊహించని రీతిలో సాధించిన విజయాలు, సాధించిన రికార్డు స్థాయి దిగుబడులు, భవిష్యత్ మార్కెట్ అంచనాల వివరాలను ఆయన ప్రత్యేకంగా వివరించారు.
*మంత్రి తుమ్మల ‘లైవ్’ పర్యవేక్షణ.. నిరంతర దిశానిర్దేశం*
ఫ్యాక్టరీ పనితీరుపై, రైతుల నుంచి వస్తున్న స్పందనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. నిత్యం చరవాణి ద్వారా మేనేజర్ నాగబాబుతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. కేవలం పైపైన కాకుండా రోజువారీ టర్నోవర్ ఎంత వస్తోంది?, గెలల రాక ఏ విధంగా ఉంది?, ఫ్యాక్టరీ రన్నింగ్ పొజిషన్ ఎలా ఉందనే సాంకేతిక అంశాలను సైతం మంత్రి స్వయంగా నిత్యం పర్యవేక్షిస్తుండటం విశేషం. మంత్రి ఈ నిరంతర పర్యవేక్షణే తమకు కొండంత అండగా నిలిచిందని, సిబ్బందిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని మేనేజర్ పేర్కొన్నారు.
*ఆగస్టులో ఆల్టైమ్ రికార్డ్.. 10 రోజులు నాన్స్టాప్ రన్నింగ్!*
ఫ్యాక్టరీ చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా గత ఆగస్టు నెలలో ఏకంగా 46,700 టన్నుల రికార్డు స్థాయి దిగుబడి వచ్చింది. సాధారణంగా పామాయిల్ ఫ్యాక్టరీలలో క్రషింగ్ జరుగుతున్నప్పుడు మిషన్లకు, బాయిలర్లకు విశ్రాంతి ఇవ్వడానికి ఫ్యాక్టరీ రన్నింగ్ను అప్పుడప్పుడు ఆపుతుంటారు. మిషన్ల నిర్వహణ కోసం ఈ బ్రేక్ అవసరమని భావిస్తారు. కానీ, ఆగస్టులో గెలల దిగుబడి భారీగా పెరగడంతో, ఫ్యాక్టరీ ఆపితే రైతులకు ఇబ్బంది వస్తుందని మేనేజర్ నాగబాబు భావించారు. ఉన్నతాధికారుల పూర్తి సహకారంతో, సాంకేతిక సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ, ఆగస్టులో ఒక్క రోజు కూడా బ్రేక్ ఇవ్వకుండా, 10 రోజుల పాటు నిర్విరామంగా ఫ్యాక్టరీని నడిపించి సరికొత్త ఘనత సాధించారు.
*పటాపంచలైన రైతుల అపోహలు..సవాల్గా తీసుకుని విజయం!*
ఫ్యాక్టరీని ఇలా పది రోజుల పాటు నిరంతరాయంగా నడిపితే సాంకేతిక ఇబ్బందులు వస్తాయని, బ్రేక్డౌన్ అవుతుందని, తద్వారా గెలల కొనుగోలు ఆగిపోయి తమకు నష్టం జరుగుతుందని గతంలో కొంతమంది రైతుల్లో బలమైన అపోహలు ఉండేవి. ఆ అపోహలను తొలగించడమే లక్ష్యంగా మేనేజర్ నాగబాబు దీన్ని ఒక పెద్ద సవాల్గా తీసుకున్నారు. పది రోజుల పాటు నిరంతరాయంగా క్రషింగ్ సాగించి, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసి, వారి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశారు. ఫ్యాక్టరీ మేనేజ్మెంట్పై రైతుల్లో నమ్మకాన్ని రెట్టింపు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో పామాయిల్ టన్ను ధర రూ.24,250 పలుకుతోంది. అయితే రాబోయే నవంబర్ నెల నాటికి అంతర్జాతీయ, స్థానిక మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మేనేజర్ తెలిపారు. నవంబర్ నాటికి టన్ను ధర ఏకంగా రూ.29,000 మార్కును తాకే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు, మార్కెట్ విశ్లేషణలు వస్తున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే గనుక నిజమైతే పామాయిల్ రైతులకు ఊహించని రీతిలో భారీ లాభాలు రావడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. తాను బాధ్యతలు స్వీకరించిన 9 నెలల్లోనే ఈ స్థాయి రికార్డులు నమోదు కావడం వెనుక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్గదర్శకత్వం, ఉన్నతాధికారుల ఎప్పటికప్పటి సహకారం, ఫ్యాక్టరీ సిబ్బంది, కార్మికుల అహర్నిశల శ్రమ దాగి ఉందని మేనేజర్ మంద నాగబాబు ఈ సందర్భంగా కృతజ్ఞతలతో కొనియాడారు.