సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కన్నా ఉద్యోగుల భద్రతే మా ప్రధాన లక్ష్యం: సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి
సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి కంటే కూడా కార్మికులు, ఉద్యోగుల భద్రతకే తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని సింగరేణి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి స్పష్టం చేశారు. గురువారం కొత్తగూడెంలో నిర్వహించిన 50వ త్రైపాక్షిక భద్రత సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రమాదరహిత సింగరేణిని సాధించడం కోసం అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (టెక్నాలజీ) వినియోగిస్తామని ఆయన వెల్లడించారు.డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (DGMS) అధికారులు, సింగరేణి యాజమాన్యం, అధికారుల సంఘం మరియు గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో గనుల్లో రక్షణ చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా, అందుబాటులో ఉన్న అత్యాధునిక మైనింగ్ టెక్నాలజీని పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కార్మిక సంఘాల నాయకులు చేసిన ప్రతి విలువైన సూచనను పరిగణనలోకి తీసుకుని తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో పాల్గొన్న డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ డాక్టర్ సగేష్ కుమార్ మాట్లాడుతూ.. గత ఏడాదికంటే ఈసారి సింగరేణిలో ప్రాణాపాయ ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గడం అభినందనీయమన్నారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో సింగరేణి ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఒకే చోట 'బయోమెట్రిక్' విధానం ద్వారా హాజరు నమోదు చేసే పద్ధతిని తక్షణమే అమలు చేయాలని ఆయన యాజమాన్యానికి సూచించారు. కార్మికులకు రక్షణ శిక్షణ ఇవ్వడానికి తమ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.కార్మిక సంఘాల ప్రతినిధులైన వాసిరెడ్డి సీతారామయ్య, రాజ్ కుమార్ (సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్), జనక్ ప్రసాద్, ఎస్. నరసింహా రెడ్డి (ఐఎన్టీయూసీ), తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, పెద్ది నరసింహులు (అధికారుల సంఘం) తదితరులు గనుల్లో ఎదురవుతున్న పలు సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది మరియు సూపర్ వైజర్ల కొరతను అధిగమించాలని, కాంట్రాక్టు కార్మికులకు నాణ్యమైన శిక్షణతో పాటు నాణ్యమైన బూట్లను సరఫరా చేయాలని, అత్యవసర స్పేర్ పార్ట్లను అందుబాటులో ఉంచాలని మరియు కార్పొరేట్ స్థాయిలో ఆధునిక వైద్య సేవలు అందించాలని వారు కోరారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు సత్వర చర్యలు చేపడతామని ప్రతినబూనారు.ఈ సమావేశంలో డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, ఎమ్. తిరుమల రావు, జిఎం (సేఫ్టీ) సాయిబాబు మరియు డీజీఎంఎస్ అధికారులు ఐ. సత్యనారాయణ, పంకజ్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు, ఇటీవలి కాలంలో వివిధ ప్రమాదాల్లో మరణించిన అమర కార్మికులకు సమావేశం ఘనంగా నివాళులర్పించి, సంతాపం ప్రకటించింది.