మయన్మార్లో శాంతి, స్థిరత్వానికి భారత్ కట్టుబడి ఉంది
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
న్యూఢిల్లీ: మయన్మార్లో శాంతి, స్థిరత్వం మరియు జాతీయ సయోధ్యకు మద్దతు ఇచ్చేందుకు భారతదేశం మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేసుకునే ప్రక్రియలో మయన్మార్కు భారత్ నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మయన్మార్ పార్లమెంట్ అంతర్జాతీయ సంబంధాల కమిటీ ఛైర్పర్సన్ డాక్టర్ ప్వెంట్ సాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భారత పర్యటనకు రాగా, బుధవారం న్యూఢిల్లీలో స్పీకర్ వారికి సాదర స్వాగతం పలికారు. భారత్ నిర్వహించే పార్లమెంటరీ సామర్థ్య నిర్మాణ కార్యక్రమంలో (PRIDE) పాల్గొనేందుకు ఈ బృందం ఇక్కడకు వచ్చింది.
భారత్ అనుసరిస్తున్న 'యాక్ట్ ఈస్ట్', 'నైబర్ హుడ్ ఫస్ట్' మరియు 'ఇండో-పసిఫిక్' విదేశాంగ విధానాల్లో మయన్మార్కు అత్యంత కీలకమైన స్థానం ఉందని ఓం బిర్లా పేర్కొన్నారు. ఉమ్మడి బౌద్ధ వారసత్వం, నాగరిక సంబంధాలు ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత దృఢం చేస్తున్నాయన్నారు.
మయన్మార్లో డిసెంబర్ 2025 నుండి జనవరి 2026 మధ్య మూడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMలు) మరియు అనుపాత ప్రాతినిధ్య విధానాన్ని ఉపయోగించడాన్ని స్పీకర్ ప్రశంసించారు. ఇది ఆ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయి అని అభివర్ణించారు.
భారత ప్రజాస్వామ్య ప్రస్థానం, 2004 నుండి విస్తృతంగా వాడుకలో ఉన్న EVMలు మరియు VVPAT వ్యవస్థల పారదర్శకతను ఆయన వివరించారు. పార్లమెంటరీ విధానాలు, నియమ నిబంధనలలో భారత్ సాధించిన అనుభవాన్ని మయన్మార్తో పంచుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. అపద సమయంలో మయన్మార్కు సహాయం అందించే తొలి దేశంగా భారత్ నిలిచిందని, ఈ సామర్థ్య నిర్మాణ శిక్షణ ఇరుదేశాల పార్లమెంటరీ సహకారాన్ని మరింత పెంపొందిస్తుందని స్పీకర్ ఓం బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు.