భార్యపై భర్త దాడి.. అడ్డువచ్చిన అత్తపైనా దాడి జ్యోతి మృతి.. అత్త ఎల్లవ్వ పరిస్థితి విషమం
సూర్య, ఎల్లారెడ్డిపేట:
భార్యపై భర్త దాడి చేయగా, అడ్డువచ్చిన అత్తపైనా దాడి చేసిన ఘటనలో భార్య మృతి చెందగా, అత్త తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పదిర గ్రామానికి చెందిన గండికోట ఎల్లవ్వ కుమార్తె జ్యోతికి ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామానికి చెందిన పల్లెపు సురేష్తో వివాహం జరిగింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో జ్యోతి తల్లిగారింటి వద్ద ఉంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి జ్యోతిపై భర్త సురేష్ దాడి చేసినట్లు, అడ్డువచ్చిన అత్త ఎల్లవ్వపై కూడా దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనలో జ్యోతి మృతి చెందగా, ఎల్లవ్వ తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. డీఎస్పీ, సీఐ, ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించినట్లు తెలిపారు. అనంతరం జ్యోతి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి, తీవ్రంగా గాయపడిన ఎల్లవ్వను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.