278 మంది లబ్ధిదారులకు రూ.1.39 కోట్లు పంపిణీ
రంగారెడ్డి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 2) : మైనార్టీ మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మహమ్మద్ అజహరోద్దిన్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా యోజన కింద రూ.1.39 కోట్ల ఆర్థిక సాయాన్ని 278 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా యోజన కింద మొత్తం 278 మంది లబ్ధిదారులకు రూ.1.39 కోట్లను అందజేశారు. నిరాశ్రయులు, విడాకులు పొందిన మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున మంజూరు చేశారు.
అదే విధంగా తుర్క కాషా ముస్లిం కమ్యూనిటీకి చెందిన పేద కుటుంబాలకు రూ.60 వేల విలువ చేసే 13 టూల్ కిట్లు, జనరేటర్లను అందజేశారు. ఈ పథకాల ద్వారా మైనార్టీ మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.