1.11 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్
సూర్య కరీంనగర్ ప్రతినిధి: కరీంనగర్ రూరల్ పోలీసులు ఇరుకుల్ల గ్రామ శివారులోని సమ్మక్క గద్దెల సమీపంలో తనిఖీలు నిర్వహించి 1 కిలో 11 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో బెజ్జంకి ప్రేమ్ కుమార్ (28)ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, అతనితో ఉన్న కాశిపాక నవీన్ (23) పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
విశ్వసనీయ సమాచారం మేరకు రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డి, ఎస్ఐ ఏ. లక్ష్మారెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. పోలీసులను గమనించిన ఇద్దరు వ్యక్తులు పారిపోగా, ప్రేమ్ కుమార్ను పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగులో 1.11 కిలోల గంజాయి, బైక్, మొబైల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నవీన్ గంజాయిని తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు ప్రేమ్ కుమార్ తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న నవీన్ను త్వరలో పట్టుకుని గంజాయి సరఫరా మూలాలను వెలికితీస్తామని తెలిపారు.
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై నిరంతరం నిఘా కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ అభినందించారు.