పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
మెదక్ మండలంలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్ చెక్కుల పంపిణీ
మెదక్: పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.బుధవారం మెదక్ మండలంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ద్వారా నిత్యావసర సరుకులు అందించడంతో పాటు, ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఆరోగ్య సమస్యలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ తాహాసిల్దార్ లక్ష్మణ్ బాబు ,సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.