‘బెత్లెహెం కుడుంబ యూనిట్’తో తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్.. సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్!
మలయాళంలో సంచలన విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'బెత్లెహెం కుడుంబ యూనిట్' తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమవుతోంది. నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన ఈ చిత్రానికి 'ప్రేమలు' ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగులో గ్రాండ్గా విడుదల చేస్తున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ విశేషాలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో హీరో, నిర్మాత ఫహద్ ఫాసిల్ మాట్లాడుతూ హైదరాబాద్ తనకు సొంతూరులా మారిందని, తెలుగు ప్రేక్షకుల ప్రేమ ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. 'ప్రేమలు'తో ఏర్పడిన అనుబంధం ఈ సినిమాతో మరింత బలపడుతుందని, గిరీశ్ ఏడీ మంచి రొమాంటిక్ కామెడీని అందించారని తెలిపారు.
హీరో నివిన్ పౌలీ మాట్లాడుతూ తెలుగులో రిలీజ్ అవుతున్న తన తొలి సినిమా ఇదేనని, ప్రేక్షకుల అందరి సపోర్ట్ కోరుకుంటున్నట్లు చెప్పారు.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ నైజాంలో విడుదల చేసిన మలయాళం వెర్షన్ రూ. 60 లక్షల గ్రాస్ సాధించిందని, ఈ స్పందన చూశాకే తెలుగులోనూ విడుదల చేయాలని డిసైడ్ అయ్యామని తెలిపారు. మలయాళంలో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించిందని, సెప్టెంబర్ 4న థియేటర్లలో ప్రేక్షకులు దీనిని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ 'ప్రేమలు'లాగే ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, దర్శకుడు గిరీశ్ ఏడీ, నటులు శ్యామ్ మోహన్, సంగీత్ మరియు ఫ్యూచర్ రన్అప్ ఫిల్మ్స్ అరుణ్ నారాయణ్ మాట్లాడుతూ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.