రాజేంద్రనగర్ జోన్లో.. 'సర్' హియరింగ్ ప్రక్రియ పరిశీలన బండ్లగూడ, హైదర్షాకోట్, శివరాంపల్లి కేంద్రాలను సందర్శించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి
రంగారెడ్డి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 2) : రాజేంద్రనగర్ జోన్ పరిధిలో జరుగుతున్న ఎస్ఐఆర్–2026 నోటీసుల హియరింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి పరిశీలించారు.
బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో కలిసి బండ్లగూడ, హైదర్షాకోట్, శివరాంపల్లి ప్రాంతాల్లో నిర్వహిస్తున్న హియరింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హియరింగ్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా, పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ‘మ్యాపింగ్ లేని కేసులు’ (నో మ్యాపింగ్), ‘అనామలీస్’ (అసమానతలు) కేటగిరీలకు సంబంధించిన దరఖాస్తులు, రికార్డుల ధృవీకరణను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు.
హియరింగ్కు హాజరయ్యే వ్యక్తుల వివరాలను నిబంధనల ప్రకారం పూర్తిగా పరిశీలించి, అవసరమైన ఆధారాలు ధృవీకరించిన తర్వాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన ఓటర్ల వివరాలు తప్పులు లేకుండా నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయడానికి తగిన సిబ్బందిని నియమించి, రోజువారీ లక్ష్యాలతో ప్రణాళికాబద్ధంగా పనులు కొనసాగించాలని సూచించారు. పత్రాల సమర్పణ, క్షేత్రస్థాయి సహాయం, రికార్డుల తనిఖీ, ధృవీకరణ వంటి ప్రతి దశను స్వయంగా పర్యవేక్షించాలని ఆయన స్పష్టం చేశారు.
శేరిలింగంపల్లి జోన్లో..
జిల్లా కలెక్టర్ పరిశీలన
అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి శేరిలింగంపల్లి జోన్లో జరుగుతున్న హియరింగ్ ప్రక్రియను పరిశీలించారు. హియరింగ్ నిర్వహణ, దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలను సమీక్షించి, ప్రక్రియను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఈఆర్వోలు), సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఏఈఆర్వోలు) తదితరులు పాల్గొన్నారు.