జనసేన యువజన విభాగంగా ‘జై కొట్టు’ ఆవిర్భావం
ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి:
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీలో మరో కీలక అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం వేదికగా జనసేన పార్టీ యువజన విభాగాన్ని ‘జై కొట్టు’ పేరుతో ప్రారంభించారు. రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు. యువతలో ఉత్సాహం, స్ఫూర్తిని నింపేలా ప్రత్యేకంగా రూపొందించిన ‘జై కొట్టు’ గీతాన్ని కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని అందించారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కేరళలో ఉన్నందున ప్రారంభ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన తన సందేశాన్ని ఆడియో రూపంలో పంపించారు. యువతను పార్టీ కార్యకలాపాల్లో మరింత చురుకుగా భాగస్వామ్యం చేయడంతో పాటు, రాజకీయాల్లో వారికి ప్రత్యేక స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ‘జై కొట్టు’ యువజన విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.యువత శక్తిని సానుకూలంగా వినియోగించుకోవడం, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువతను భాగస్వాములను చేయడం ఈ విభాగం ప్రధాన లక్ష్యాలుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.