గిరిజనుల జీవితాలతో ఆటలాడుతున్న జగన్..
ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి: గిరిజనుల భవిష్యత్తుతో రాజకీయాల కోసం చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకునేది లేదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హెచ్చరించారు. గిరిజనుల సంక్షేమం, విద్య, అభివృద్ధి విషయంలో గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలను ప్రశ్నిస్తూ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోని జగన్కు ఇప్పుడు గిరిజనులపై అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందా అని సంధ్యారాణి ప్రశ్నించారు. మహిళలు, గిరిజనుల గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీకి చెందిన మహిళా నాయకులు, రాజధాని మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రజలు మరిచిపోలేదన్నారు. గిరిజనుల ప్రయోజనాలను కాపాడే విషయంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. గిరిజనులకు కీలకమైన జీఓ నంబర్–3 విషయంలో సుప్రీంకోర్టులో నెలరోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయకుండా వదిలేసిన వ్యక్తి ఇప్పుడు గిరిజనుల హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జీఓ–3ను తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదేనని, దానిని కాపాడేందుకు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.వైసీపీ పాలనలో ఐటీడీఏలను నిర్లక్ష్యం చేశారని, బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, విదేశీ విద్య వంటి గిరిజన విద్యాభివృద్ధి పథకాలను రద్దు చేశారని సంధ్యారాణి విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లోని సహజ వనరులు, ఖనిజ సంపద విషయంలోనూ గత ప్రభుత్వం సరైన రక్షణ కల్పించలేదని ఆరోపించారు. అప్పట్లో వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.