అనకాపల్లి మైన్స్ కార్యాలయంలో రికార్డులు సేఫ్
*వదంతులు ప్రజలు నమ్మవద్దు
*అనకాపల్లి మైన్స్ శాఖ అధికారులు వెల్లడి
అనకాపల్లి, సెప్టెంబర్ 2, మేజర్ న్యూస్: అనకాపల్లి మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యాలయంలో రికార్డులు అపహరణకు గురి కాలేదని లేదని, సస్పెండ్ అయిన అధికారి సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ ఎటువంటి రికార్డులను తీసుకెళ్లలేదని అనకాపల్లి మైన్స్ శాఖ కార్యాలయ అధికారులు నిర్ధారణ చేశారు. గత రెండు రోజులుగా వివిధ ప్రసారమాధ్యమాల్లో వస్తున్నవార్తలపై ఆ శాఖ అధికారులు స్పందించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులు తస్కరించడం అనేది పెద్ద విషయమని, నిరాధారంగా అటువంటి ఆరోపణలు చేయకూడదని హెచ్చరించారు. ఏసీబీ ట్రాప్ లో సస్పెండ్ అయిన కార్యాలయ ఉద్యోగి కేవలం తన సొంత వస్తువులు అనగా క్యారియర్ మెడికల్ కిట్టు హాస్పిటల్ రిపోర్టులు మాత్రమే సోమవారం అనకాపల్లి కార్యాలయానికి వచ్చి తన వెంట తీసుకువెళ్లారని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీ ట్రాప్ ద్వారా పట్టుబడి సస్పెండ్ అయినప్పటికీ నిజనిర్ధారణ కాకుండా అతనిపై అభాండాలు వేయడం, ఆధారం లేకుండా నిందలుమోపడం వంటి పనులను కొందరు వ్యక్తులు అదేపనిగా చేస్తున్నారని, అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వివరించారు.
మైన్స్ కార్యాలయంపై రాజకీయ ఉచ్చు
ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లాలో అక్రమ మైనింగ్ పై మైన్స్ అధికారులు వరసదాడులు నిర్వహిస్తున్నారు. యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార్ల కొండపై జరిగిన అక్రమ తవ్వకాలు మొదలుకొని, అనకాపల్లి మండలంలోని వేటజంగాలపాలెం రెవెన్యూ పరిధిలోని 84 సర్వే నెంబర్లో అక్రమ మైనింగ్ పై ఉక్కు పాదం మోపారు. వీటి ప్రభావంతోనే అనకాపల్లి మైన్స్ కార్యాలయం పై రాజకీయ ఉచ్చు బిగిసుకుంటుందని బహిరంగంగా చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే ఆగస్టు 6న అనకాపల్లి మైన్స్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించిందని బోగట్టా. సదరు క్వారీలను సర్వే చేసి అక్రమంగా తవ్వినది నిజమేనని తెలిపినందుకు సదరు అధికారిపై కక్షగట్టి రాజకీయ నేతలు పక్కాగా పన్నిన వలగా రాజకీయ ఉద్దండులు పేర్కొంటున్నారు.