రేవంత్ పై కొండా సురేఖ ఫైర్
*సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఢిల్లీ: కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేసి తనపై చర్యలు తీసుకోవద్దని కోరారు. మహిళలు స్వతంత్రంగా జీవించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చెబుతున్నారని, అదే స్ఫూర్తితో మహిళలకు స్వేచ్ఛ ఉండాలని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
తన కుమార్తె స్వతంత్రంగా మాట్లాడిన విషయానికి తనను బాధ్యురాలిని చేయడం సరికాదని సురేఖ అన్నారు. తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“పదేళ్లు సీఎంగా ఉంటాను” అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన సురేఖ.. అది పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వ్యాఖ్య కాదా అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని బహిరంగంగా ప్రకటించడం పార్టీ నిర్ణయాలకు, క్రమశిక్షణకు సంబంధించిన అంశం కాదా అని నిలదీశారు.
తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే వివరణ ఇచ్చిన విషయాన్ని కూడా సురేఖ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తన కుటుంబ సభ్యుల వ్యాఖ్యలను తనకు ఆపాదించి చర్యలు తీసుకోవడం న్యాయం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలకు స్వేచ్ఛ, స్వతంత్రత గురించి పార్టీ అగ్రనేతలు చెబుతున్న విషయాలను ఆచరణలోనూ పాటించాలని సూచించారు.
ఈ వ్యవహారంలో తనపై మాత్రమే కాకుండా, పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అన్ని వ్యాఖ్యలను ఒకే విధంగా పరిశీలించాలని సురేఖ కోరినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చినట్లైంది.