నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందిస్తాం
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర
గుండ్లుపేట (కర్ణాటక): కర్ణాటకలోని గుండ్లుపేట తాలూకాలో వర్షాభావం కారణంగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున తగిన పరిహారం అందిస్తామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర హామీ ఇచ్చారు. గుండ్లుపేట తాలూకాలో క్షీణించిన పంట పొలాలను, కరువు పరిస్థితులను స్వయంగా పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
వర్షాలు లేకపోవడంతో గుండ్లుపేట ప్రాంతంలో విస్తృతంగా సాగుచేసే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, చెరకుతో పాటు ప్రసిద్ధి చెందిన 'నంజన్గూడు అరటి' తోటలు ఎండిపోయాయని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలోని ఇతర కరువు పీడిత ప్రాంతాలతో పోలిస్తే గుండ్లుపేటలో పంట నష్టం తీవ్రత చాలా ఎక్కువగా ఉందన్నారు.
కొద్దిమంది రైతులు మాత్రమే పంట బీమా చేయించుకోగా, అత్యధికులకు ఎలాంటి బీమా రక్షణ లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి రైతుకు సరైన నష్టపరిహారం చెల్లిస్తుందని జి. పరమేశ్వర స్పష్టం చేశారు.