డిజిటల్ బీమా, మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫారమ్లు ప్రారంభం
9వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో IPPB
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) తన 9వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని చెల్లింపులు, బీమా, పెట్టుబడి సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలు నూతన డిజిటల్ ప్లాట్ఫారమ్లను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర తపాలా శాఖ ఆధ్వర్యంలో 100% ప్రభుత్వ యాజమాన్యంతో నడిచే IPPB, సాధారణ బ్యాంకింగ్ సేవలకు అతీతంగా ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల సమాచారాన్ని తక్షణమే పొందేందుకు సులభతరమైన సౌండ్ బాక్స్ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు. వినియోగదారులకు జీవిత, ఆరోగ్య, సాధారణ బీమా సేవలందించేందుకు ప్రత్యేక టెక్నాలజీ ప్లాట్ఫారమ్తో పాటు, సులభంగా పెట్టుబడులు పెట్టేందుకు 'డిజిటల్ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫారమ్'ను ప్రవేశపెట్టారు.
స్వయం సహాయక బృందాల (SHG) కోసం ప్రత్యేక ఖాతా, ₹25,000 సైబర్ బీమా సదుపాయం కల్పించే ‘సురక్షిత్ పొదుపు ఖాతా’ మరియు ఆరోగ్య వెల్నెస్ సేవలు కలిగిన ‘సంపూర్ణ పొదుపు ఖాతా’లను అందుబాటులోకి తెచ్చారు.
మార్చి 31, 2026 నాటికి బ్యాంకు వినియోగదారుల సంఖ్య 13.25 కోట్లకు చేరింది. ఇందులో 77% మంది గ్రామీణులు, 49% మంది మహిళలు ఉన్నారు. డిపాజిట్లు ₹29,104 కోట్లకు చేరాయి. మొత్తం ₹21.61 లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరగ్గా, అందులో యుపిఐ (UPI) వాటా ₹7.41 లక్షల కోట్లు. 6.5 కోట్ల మంది లబ్ధిదారులకు ₹1.55 లక్షల కోట్ల నేరుగా నగదు బదిలీ (DBT) సేవలు అందించగా, ఆధార్ ఆధారిత లావాదేవీల (AePS) ద్వారా ₹36,140 కోట్లు పంపిణీ చేశారు. అదనంగా 29.43 లక్షల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి.
ఇండియా పోస్ట్ విశ్వసనీయతను, ఆధునిక సాంకేతికతను జోడించి దేశంలోని 5.57 లక్షల గ్రామాల్లో చివరి మైలు వరకు కాగితరహిత, నగదురహిత బ్యాంకింగ్ సేవలను అందించడమే తమ ప్రధాన బలం అని IPPB ఎండీ మరియు సీఈఓ ఆర్. విశ్వేశ్వరన్ పేర్కొన్నారు.