పులుల సంరక్షణకు జీవావరణాన్ని, మానవ అవసరాలను సమతుల్యం చేయాలి
కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్
న్యూఢిల్లీ: పులుల ఆవాసాల రక్షణకు, పర్యావరణ భద్రతకు ప్రజలు మరియు ప్రకృతి మధ్య సహజీవనమే పునాది కావాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీలో 'పులుల ఆవాసాలు: జీవనోపాధి, పర్యావరణ పర్యాటకం' అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ వర్క్షాప్ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (IBCA), ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ADB), నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) సంయుక్తంగా సెప్టెంబర్ 2, 3 తేదీలలో ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి.
ప్రాజెక్ట్ టైగర్ సఫలతను గుర్తుచేస్తూ, పులుల మనుగడ అడవులు, వన్యప్రాణుల కారిడార్లు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యపడుతుందని మంత్రి తెలిపారు. జంతువుల పరిరక్షణను మానవాభివృద్ధితో అనుసంధానించాలని పిలుపునిచ్చారు. ఎడారీకరణ, నేల తేమ క్షీణత వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు స్థానిక వర్గాల సాంప్రదాయ జ్ఞానాన్ని పర్యావరణ విధాన రూపకల్పనలో భాగం చేయాలని స్పష్టం చేశారు.
ఈ వేదికపై 'ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్' (IBCA) మరియు 'ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్' (ADB) మధ్య పరస్పర అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
భారత్తో ఏడిబి (ADB) భాగస్వామ్యానికి 2026 నాటికి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ADB కంట్రీ డైరెక్టర్ మియా ఓకా మాట్లాడారు. పెద్ద పులులు ఉండే దేశాలను ఏకతాటిపైకి తెచ్చి, సుస్థిర ఆర్థిక అవకాశాలను కల్పించేందుకు భారతదేశం చేస్తున్న కృషికి పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు.
ఈ అంతర్జాతీయ వర్క్షాప్కు బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, మలేషియా, నేపాల్, వియత్నాం ప్రతినిధులతో పాటు అటవీ శాఖ ఉన్నతాధికారులు, పరిశోధకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.