వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి
న్యూఢిల్లీ: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి బృహత్తర అభివృద్ధి పనులతో పాటు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో వైఎస్సార్ పాలనపై చెరగని ముద్ర వేశారని స్మరించుకున్నారు. పేదలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.
ఈ నివాళి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, హర్కర వేణుగోపాల రావుతో పాటు ఎంపీలు ఎం. అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేష్ షెట్కార్, పోరిక బలరామ్ నాయక్ మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని నివాళులర్పించారు.