‘ఇన్వెస్ట్ తెలంగాణ’కు రాజ్ నాథ్ సింగ్కు ఆహ్వానం
రక్షణ ఎక్స్పో-2026 ప్రారంభించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026'కు హాజరు కావాల్సిందిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, పలువురు ఎంపీలతో కలసి కేంద్ర మంత్రితో భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించారు.
భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City) వేదికగా డిసెంబర్ 7 నుండి 9వ తేదీ వరకు ఈ సదస్సును నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు.
సదస్సులో భాగంగా నిర్వహించే 'డిఫెన్స్ ఎక్స్పో-2026'ను ప్రారంభించాలని రాజ్నాథ్ సింగ్ను సీఎం కోరారు. ఇందులో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల ప్రత్యేక సదస్సుతో పాటు వైమానిక దళానికి చెందిన ‘సూర్యకిరణ్’, ‘సారంగ్’ బృందాల ఏరోబాటిక్ ప్రదర్శనలు, ఎయిర్ షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
DRDO, HAL, BEL, BDL, MDL వంటి ప్రముఖ రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, విదేశీ రక్షణ ప్రతినిధులు ఈ ఎక్స్పోలో విస్తృతంగా పాల్గొనేలా రక్షణ శాఖ సహకరించాలని కోరారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు కోసం రక్షణ శాఖ కోరిన 1,500 ఎకరాలలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 750 ఎకరాలు సేకరించిందని, మిగిలిన 750 ఎకరాలను కూడా సేకరించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని సీఎం వివరించారు.
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో డిఆర్డిఎల్ (DRDL) చేపడుతున్న ప్రాజెక్టు కోసం 416.18 ఎకరాల భూమిని ఏడాదికి కేవలం రూ. 1 నామమాత్రపు లీజుతో 33 సంవత్సరాల కాలానికి కేటాయించేందుకు TGIIC అంగీకరించిందని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి తెలిపారు.
దేశవ్యాప్తంగా రక్షణ పరిశ్రమలు, స్టార్టప్లు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే ఈ డిఫెన్స్ ఎక్స్పోకు రక్షణ మంత్రి హాజరై మార్గనిర్దేశం చేస్తే రాష్ట్రానికి, పరిశ్రమలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.