‘సుఖదుఃఖాల్లో భారత్ మా వెంటే’
నేపాల్ ఆరోగ్య మంత్రి నిషా మెహతా కృతజ్ఞతలు
రసువా (నేపాల్): వరద బీభత్సంతో తీవ్ర విపత్తును ఎదుర్కొంటున్న నేపాల్కు భారత్ అందిస్తున్న అపారమైన సహాయ సహకారాలపై ఆ దేశ ఆరోగ్య మంత్రి నిషా మెహతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాధితుల మృతదేహాల గుర్తింపు, డీఎన్ఏ (DNA) పరీక్షలు మరియు డీఎన్ఏ విశ్లేషణ ప్రయోగశాలల ఏర్పాటులో భారత్ నిపుణుల బృందాలను పంపి ఎంతగానో సహకరిస్తోందని ఆమె వెల్లడించారు.
"భారత్, నేపాల్ల మధ్య రోటీ-బేటీ (ఆహారం, బంధుత్వం) సంబంధాలు ఉన్నాయి. శుభకార్యాల్లోనే కాకుండా, ఇలాంటి కష్టకాలంలోనూ భారత్ కుటుంబ సభ్యుడిలా మా వెంటే నిలిచింది. మా బాధను తమ బాధగా భావించి సహాయం అందిస్తోంది" అని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు.
వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల నిర్వహణ, గుర్తింపు ప్రస్తుతం పెద్ద సవాలుగా మారిందని, దీన్ని ఎదుర్కొనేందుకు భారత్ నుండి ప్రత్యేక నిపుణుల బృందం నేపాల్కు వచ్చిందని తెలిపారు. అలాగే డీఎన్ఏ విశ్లేషణ ల్యాబ్ల ఏర్పాటుకు కూడా భారత్ సహకరిస్తోందన్నారు. రక్షించిన బాధితుల కోసం ప్రత్యేక కేంద్రాలు (హోల్డింగ్ సెంటర్లు) ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. పొరుగు దేశాలతో పాటు WHO, UNICEF వంటి అంతర్జాతీయ సంస్థలు క్షేత్రస్థాయిలో సహాయక చర్యల్లో భాగస్వామ్యమవుతున్నాయని చెప్పారు.
1,127కు చేరిన మృతుల సంఖ్య
నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 1,127కు చేరిందని నేపాల్ పోలీసులు బుధవారం ధ్రువీకరించారు. చిత్వాన్ (348), తూర్పు నవల్పరాసి (217), పశ్చిమ నవల్పరాసి (190), నువాకోట్ (155) ప్రాంతాల్లో అత్యధికంగా ప్రాణనష్టం సంభవించింది.
తీవ్రంగా దెబ్బతిన్న మృతదేహాల కారణంగా ఇప్పటివరకు కేవలం 95 మృతదేహాలను మాత్రమే గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించగలిగారు. మిగిలిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియను భారత నిపుణుల బృందం వేగవంతం చేస్తోంది.