కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం యూటర్న్? రంగంలోకి అగ్రనేతలు!
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ హైకమాండ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సురేఖపై చర్యలకు కసరత్తు జరుగుతోందన్న వార్తల నడుమ, పార్టీలోని పలువురు కీలక నేతలు ఆమెకు మద్దతుగా నిలవడంతో అధిష్టానం తన నిర్ణయాన్ని పునరాలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. కొండా సురేఖకు మద్దతుగా ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఒక అగ్రనేత నిలిచారు. ఆమెపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పార్టీ పెద్దలను కోరారు.
సురేఖను క్యాబినెట్ నుంచి తొలగిస్తే తీవ్ర రాజకీయ పరిణామాలు ఉంటాయని మరొక ఏఐసీసీ కార్యదర్శి హెచ్చరించారు. పదవి తీసేస్తే ఆమె ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని, దీనివల్ల ఉప ఎన్నిక అనివార్యమై రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లకు ఇద్దరు రాష్ట్ర మంత్రులు తమ అభిప్రాయాలను లేఖ/సందేశం ద్వారా తెలిపారు. సురేఖపై ఏ నిర్ణయం తీసుకున్నా ఆమెతో ముందుగా సంప్రదింపులు జరపాలని కోరారు.
ఒకవేళ కొండా సురేఖపై వేటు వేస్తే బీసీ సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఆందోళనతో అధిష్టానం వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. కొండా సురేఖకు సొంత పార్టీలోనే మద్దతుదారులు పెరగడం, హైకమాండ్ సైతం పునరాలోచనలో పడటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.