మొగల్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన: మత్స్యకారులతో మమేకమై పింఛన్ల పంపిణీ
పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం పర్యటించారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రత్యక్షంగా మత్స్యకారుల కుటుంబాలను కలిసి పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నేరుగా వేటకు వెళ్లే ఫెర్రీ పాయింట్కు చేరుకున్నారు. అక్కడ పడవల వద్ద కూర్చున్న పలువురు మత్స్యకారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. తిరుమని స్వామి అనే మత్స్యకారుడికి ముఖ్యమంత్రి స్వయంగా పింఛను సొమ్మును అందజేశారు. వారి కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రభుత్వ పథకాల అమలు పట్ల మత్స్యకారుల కుటుంబాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. అలాగే సముద్ర వేట సమయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా వారు సీఎం దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు.