ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నిర్వహిస్తున్న కార్గో సేవలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్గో నిర్వహణ బాధ్యతలను ఒక ప్రముఖ ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తూ దాదాపు 10 నుండి 15 ఏళ్ల కాలపరిమితితో అధికారిక ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
ఇప్పటివరకు కార్గో విభాగంలో విధులు నిర్వహించిన ఆర్టీసీ సిబ్బందిని తిరిగి రవాణా (ఆర్టీసీ) డ్యూటీల్లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2020లో ప్రారంభమైన ఈ కార్గో సర్వీసులు తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందాయి. అయితే ఇప్పుడు ఉన్నపళంగా ఈ సేవలను ప్రైవేట్ పరం చేయడం గమనార్హం.
ఆర్టీసీ కార్గో సేవలు ప్రైవేట్ సంస్థ పరిధిలోకి వెళ్లడంతో భవిష్యత్తులో పార్సిల్ చార్జీలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని సామాన్య ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలోని కీలక సేవలను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడంపై పలు రవాణా సంఘాల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.