కాంగ్రెస్ ‘1000 రోజుల విఫల పాలన’పై ఉధృతమైన బీఆర్ఎస్ నిరసనలు
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైందంటూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాయి.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మేడిపల్లి, బొడుప్పల్ ప్రాంతాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లా రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. గజ్వేల్ పట్టణంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ 'బాకీ కార్డుల' పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
మార్కెట్ రోడ్డులో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకులు 100 మీటర్ల భారీ ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను విస్మరించిందని, ప్రజలను వంచించిన ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని నిరసనల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.