లక్ష్యాలకు మించి బొగ్గు ఉత్పత్తి, రవాణా
సూర్య మందమర్రి: సింగరేణి మందమర్రి ఏరియా నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తూ ప్రగతి సాధిస్తోందని ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టులో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో 105 శాతం, ఓబీ తొలగింపులో 102 శాతం ప్రగతి సాధించినట్లు తెలిపారు. ఆర్కేపీ ఓసీ విస్తరణకు ఫారెస్ట్ క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతమైందని, పెద్దనపల్లి వద్ద 150 ఎకరాల భూసేకరణ కొనసాగుతోందన్నారు. దుబ్బగూడం నిర్వాసితుల ఆర్అండ్ఆర్ కాలనీ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, సీఎంపీఎఫ్, పెన్షన్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు రూ.7.5 కోట్లతో హైటెక్ కిచెన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏరియా అభివృద్ధికి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, యూనియన్ ప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, డీజీఎం (ఐఈడీ) కిరణ్ కుమార్, సీనియర్ పర్సనల్ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.