సీపీఎస్ రద్దు చేసి.. ఓపీఎస్ పునరుద్ధరించాలి రిటైర్మెంట్ తర్వాత భద్రత కోసం నిరసన
సూర్య మందమర్రి:కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపిఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం మిగిలిన జీవితాన్ని ఆర్థిక భద్రతతో, ఆనందంగా గడిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగుల పదవీ విరమణ అనంతర జీవితం ఆర్థిక అనిశ్చితికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అదనపు తహసీల్దార్ ఆనంద్ కుమార్, నాయబ్ తహసీల్దార్ సంతోష్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ (గిర్దావర్) అంజన్ కుమార్తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.