బూటకపు కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు.. నా హయాంలో రూ.1,680 కోట్లతో అభివృద్ధి పనులు పైలెట్ తాండూరులో గర్జించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
తాండూరు, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 2): గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను తాండూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ.1,680 కోట్ల నిధులు తీసుకొచ్చి వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం తాండూరు పట్టణంలోని ఇందిరాగాంధీ చౌక్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పైలెట్ రోహిత్రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రస్తుతం అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. తాండూరు నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని అన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని రోహిత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాటలను ప్రజలు నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.