బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
సూర్య కరీంనగర్ ప్రతినిధి: కరీంనగర్ జిల్లాలో బుధవారం పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. బస్సు సగం భాగం బావిపై వేలాడుతూ ఆగిపోవడంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న బస్సు సుందరగిరి శివారుకు చేరుకోగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.