మ్యాజిక్కా.... మజాకానా పుష్పక విమానాన్ని తలపిస్తున్న టాటా మ్యాజిక్ లు
ప్రయాణికుల భద్రతను పట్టించుకోని డ్రైవర్లు
కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్న వైనం
చర్ల,సూర్య(మేజర్ న్యూస్):
చర్ల మండలంలో వ్యవసాయ కూలి పనులకు వెళ్లే ఆదివాసీలను పని ప్రదేశం నుండి వారి గ్రామం వరకు చేరవేస్తున్న టాటా మ్యాజిక్ యజమానులు, డ్రైవర్లు వ్యవసాయ కూలీల భద్రతను ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. తమకు ఎక్కువ కిరాయి వస్తుందనే ఆశతో వ్యవసాయ కూలీలను మ్యాజిక్ టాప్ పైన, వెనుక భాగంలో కూడా ఎక్కించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
పుష్పక విమానంలో ఎంత మంది ఎక్కిన మరొకరికి చోటు ఉంటుందని చందంగా టాటా మ్యాజిక్ నిర్వాహకులు వ్యవసాయ కూలీలను పరిమితికి మించి ఎక్కించుకొని వారి ప్రాణాలతో ఆటలాడుతున్నారు.
కేవలం డబ్బులు ఎక్కువ వస్తాయి అనే ఆశతో ఇబ్బడి ముబ్బడిగా ప్రయాణికులను ఎక్కించుకొని అధిక వేగంతో వెళుతున్నారు. ఈ కారణం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆటోలు, టాటా మ్యాజిక్ లకు వాటి పరిమితికి లోబడి ప్రయాణికులను ఎక్కించుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ దానిని మీరు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ప్రయాణికుల (ఆదివాసీ వ్యవసాయ కూలీలు) ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. పై ఫోటోలో చూస్తే టాటా మ్యాజిక్ టాప్ పైన ఆదివాసీ యువతులు కూర్చుండగా, వెనుక మరికొందరు యువతులు వేలాడుతూ వెళ్తున్నారు. అయితే ఇంత లోడు ఉన్న టాటా మ్యాజిక్ వాహనం అత్యధిక వేగంతో మండల కేంద్రంలో రోడ్లపై వెళ్తుండడం గమనార్హం.
రవాణా శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి అధిక లోడుతో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న టాటా మ్యాజిక్ ల యజమానులు, డ్రైవర్ల పై చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ కూలీలను తరలించే వాహనాల యజమానులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని మండల ప్రజలు కోరుతున్నారు.