42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నిర్వహించాలి
బీసీలపై ముఖ్యమంత్రి వైఖరి మార్చుకోవాలి
జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య
మోమిన్పేట్,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 2):రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఆర్. కృష్ణయ్య, సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలంలోని రాళ్లగుడిపల్లి గ్రామంలో వారు విలేకరులతో మాట్లాడారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని వారు ఆరోపించారు. గతంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను తగ్గించడంతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ బీసీలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. మంత్రివర్గంలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉండగా, కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించి ప్రాధాన్యత లేని శాఖలు కేటాయించడం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు.
కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు సమాచార శాఖ కమిషనర్లు, కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ వంటి కీలక పదవుల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడంతో పాటు బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయాలని అన్నారు.బీసీ సంక్షేమ శాఖలో కీలక అధికారుల నియామకాల్లోనూ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. బీసీల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి, మండల బీజేపీ అధ్యక్షుడు ఆశిరెడ్డి, సర్పంచులు పాల్, రాజు చౌహాన్, బీసీ సంఘం నాయకులు లక్ష్మయ్య, రామ్పాల్ యాదవ్, భీమ్రాజు, లింగం, అశోక్, బక్క కృష్ణ, పీవీ దాస్, అనంతి, రామచందర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.