తుక్కుగూడ హత్యాచార బాధితురాలి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ
రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేత
హైదరాబాద్/కొత్తగూడెం: తుక్కుగూడలో దారుణంగా ఉన్మాది చేతిలో హత్యాచారానికి గురైన నర్సు కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి అండగా ఉంటామని భరోసానిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులతో ఆయన ఫోన్లో మాట్లాడి, వారిని పరామర్శించారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ పరంగా పోరాడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, దోషికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు.
కేటీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు చౌటిగూడెంలోని బాధిత యువతి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, రూ. 50,000 తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రభుత్వం నుంచి తగిన పరిహారం మరియు బాధితులకు వేగవంతమైన న్యాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.