జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
జల నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)
న్యూఢిల్లీ: దేశంలో జల డేటా పాలనను బలోపేతం చేయడానికి మరియు నీటి సంరక్షణ, వినియోగాన్ని మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘జాతీయ జల శాఖా సదస్సు’ ముగింపు సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.
సమర్థవంతమైన జల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఫార్మాట్ ద్వారా జల డేటాను సేకరించి, విశ్లేషించడానికి ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ప్రధాని సూచించారు. ఈ సదస్సు కేవలం ఒక్కసారి జరిగే కార్యక్రమంగా మిగిలిపోకూడదని, కాలపరిమితితో కూడిన ప్రణాళికలతో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
నీటి పొదుపు, సంరక్షణపై ప్రజలలో అవగాహన పెంచేందుకు ‘జల్ ఉత్సవ్’ను ప్రోత్సహించాలి. వ్యవసాయం, పారిశ్రామిక అవసరాల కోసం శుద్ధి చేసిన నీటిని (Treated Water) సమర్థవంతంగా పునరుపయోగించాలి.ప్రతి రుతుపవనాలకు ముందే ఆనకట్టల భద్రతా చర్యలు పూర్తి చేయాలి. నీటి యాజమాన్యంపై పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఉత్తమ జల నిర్వహణ పద్ధతులను అధ్యయనం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులతో క్రమబద్ధమైన అంతర్రాష్ట్ర పర్యటనలు ఏర్పాటు చేయాలి.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ మాట్లాడుతూ.. నీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడం, తాగునీటి వనరుల దీర్ఘకాలిక స్థిరత్వం, గ్రామీణ తాగునీటి పథకాల సమర్థవంతమైన పర్యవేక్షణ వంటి నాలుగు కీలక అంశాలపై ఈ సదస్సు దృష్టి సారించిందని వెల్లడించారు.