166 మంది భారతీయుల రక్షణ.. సహాయక చర్యలను తీవ్రతరం చేసిన భారత్
న్యూఢిల్లీ/కాఠ్మండు: వరదలు, కొండచరియలు విరిగిపడి అతలాకుతలమైన నేపాల్లో భారత్ తన సహాయ, రెస్క్యూ చర్యలను మరింత ముమ్మరం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల నుండి ఇప్పటివరకు మొత్తం 166 మంది భారత జాతీయులను క్షేమంగా రక్షించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది.
మరోవైపు, తీర్థయాత్రలు, ఇతర పనుల నిమిత్తం టిబెట్ సందర్శనకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన 410 మంది భారత పౌరులు కూడా చైనా నుండి స్వదేశానికి బయలుదేరినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
భారత వైమానిక దళానికి చెందిన ఐదవ ప్రత్యేక విమానం సెప్టెంబర్ 2న మానవతా సహాయంతో కాఠ్మండు చేరుకుంది. ఇందులో సుమారు 5.5 టన్నుల అ అత్యవసర వైద్య సామాగ్రి (యాంటీబయాటిక్స్, సర్జికల్ సామాగ్రి, అనాల్జెసిక్స్)తో పాటు, 11 మంది సభ్యుల ప్రత్యేక సహాయక బృందం మరియు 6 టన్నుల రెస్క్యూ పరికరాలను పంపారు. ఈ విడతతో కలిపి భారత్ ఇప్పటివరకు నేపాల్కు మొత్తం 74 టన్నుల సహాయ సామగ్రిని అందజేసింది.
భారత సొరంగ సహాయక బృందం తమ స్థావరాన్ని శ్యాబ్రుబేసికి మార్చి నేపాల్ సైన్యంతో కలిసి సహాయక చర్యలు వేగవంతం చేసింది. బురద, అడ్డంకులు ఉన్నప్పటికీ రెస్క్యూ టీమ్స్ సొరంగంలోకి 100 మీటర్ల మేర ముందుకు వెళ్లాయి. గాలింపు చర్యలను వేగవంతం చేసేందుకు సొరంగం వరకు తాత్కాలిక రహదారి ఏర్పాటును పరిశీలిస్తున్నారు.
మృతుల గుర్తింపు కోసం భారత ఫోరెన్సిక్ బృందం నేపాల్ నిపుణులతో కలిసి కాఠ్మండులోని ప్రయోగశాలల్లో డీఎన్ఏ నమూనాలను విశ్లేషిస్తోంది. గురువారం నుంచి భారత నిపుణులు మరిన్ని ప్రత్యేక పరికరాలతో త్రిశూలి బజార్ సమీపంలో నేపాల్ ఆర్మీతో కలిసి పనులను వేగవంతం చేయనున్నారు.