భారత్లో అడుగుపెట్టిన బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్
న్యూఢిల్లీలో ఘన స్వాగతం
న్యూఢిల్లీ: అధికారిక పర్యటన నిమిత్తం బెల్జియం ప్రధాన మంత్రి బార్ట్ డి వెవర్ గురువారం భారత రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ ఘన స్వాగతం పలికారు.
ఈ పర్యటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా (X) స్పందిస్తూ.. "భారత అధికారిక పర్యటనకు విచ్చేసిన బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్కు సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈ పర్యటన భారతదేశం మరియు బెల్జియం మధ్య ఉన్న సన్నిహిత, బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తుంది" అని పేర్కొన్నారు.
బహుముఖ భాగస్వామ్య బలోపేతం
ఈ పర్యటనలో భాగంగా బెల్జియం ప్రధాని భారత ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలతో సమావేశమై ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక, రక్షణ మరియు సాంకేతిక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించేందుకు పలు కీలక చర్చలు జరపనున్నారు.