ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలోకి మంత్రి పొంగులేటి కుటుంబం
హైదరాబాద్లో 'రాఘవ ఏరోస్పేస్' ప్రారంభం
హైదరాబాద్: ఏరోస్పేస్, డిఫెన్స్ ఆయుధ తయారీ రంగంలోకి తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబం అడుగుపెట్టింది. హైదరాబాద్లోని కోకాపేట్ వేదికగా నూతనంగా ఏర్పాటు చేసిన "రాఘవ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (RADPL)" కొత్త సదుపాయాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సంస్థకు మంత్రి కుమారుడు పొంగులేటి లిఖిత్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా వ్యవహరిస్తున్నారు.
ఈ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) మాజీ ఛైర్మన్ డాక్టర్ జి. సతీశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్ దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతిదారుగా ఎదుగుతోందని, అందులో ప్రైవేట్ భాగస్వామ్యం కీలకమని సతీశ్రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D), ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, కాంపోజిట్ స్ట్రక్చర్ల తయారీపై ఈ సంస్థ ప్రధానంగా దృష్టి సారించనుంది. మైక్రోవేవ్ అసెంబ్లీ కోసం క్లీన్ రూమ్లు, 40 గిగాహెర్జ్ వరకు రేడియో ఫ్రీక్వెన్సీ, మైక్రోవేవ్ పరీక్షా సదుపాయాలు మరియు ఇంటిగ్రేషన్ ల్యాబ్లను ఈ ప్లాంట్లో ఏర్పాటు చేశారు.
‘పెరిడాట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్’ సంస్థతో కలిసి పూర్తిగా భారతీయ యాజమాన్య డిజైన్తో కూడిన MALE-300 అనే డ్రోన్/మానవరహిత విమానాన్ని జాయింట్ వెంచర్ కింద అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీని పెంచడంతో పాటు అంతర్జాతీయ ఎగుమతులపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పొంగులేటి లిఖిత్ రెడ్డి వెల్లడించారు.