రేవా బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి
రేవా (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి-39పై బుధవారం సాయంత్రం వేగంగా వచ్చిన బస్సు, ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గుధ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బద్వార్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద ధాటికి ట్రక్కు బోల్తా పడగా, బస్సు సమీపంలోని నీటితో నిండిన కాలువలో పడిపోయిందని అదనపు ఎస్పీ భావన మరావి తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "మధ్యప్రదేశ్లోని రేవా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ప్రధాని కార్యాలయం (PMO) 'X' వేదికగా సందేశాన్ని విడుదల చేసింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష చొప్పున పరిహారం అందించాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రిలో అదనపు పడకలను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.