national
నీటి వివాదం.. యోగీ ప్రభుత్వ వేధింపులకు ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ రాజీనామా?
ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ రాజీనామా
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ రాజీనామా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దేశ సేవ చేయాలనే లక్ష్యంతో లండన్ ఉద్యోగాన్ని వదులుకుని సివిల్ సర్వీసెస్లోకి వచ్చిన ఆమె, 13 ఏళ్ల సర్వీసును మధ్యలోనే ముగించారు. ఆగస్టు 30, 2026న ఆమె స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
లండన్ ఉద్యోగం వదిలి.. దేశ సేవ కోసం
ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరు పూర్వ విద్యార్థి అయిన దివ్య మిట్టల్, లండన్లో ఉన్న మంచి ఉద్యోగాన్ని త్యజించి 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణిగా యూపీ కేడర్లో చేరారు. గత 13 ఏళ్లలో వివిధ జిల్లాల్లో సేవలందిస్తూ.. ప్రజల సంక్షేమానికి నేరుగా ఉపయోగపడే వినూత్న కార్యక్రమాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
75 ఏళ్ల నీటి సమస్యకు చరమగీతం
మిర్జాపూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న కాలంలో ఆమె తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. కొండ ప్రాంతంలో ఉండటం వల్ల దశాబ్దాలుగా తాగునీటికి నోచుకోని ‘లహురియాదహ్’ గ్రామంపై ఆమె దృష్టిసారించారు. సుమారు 1,200 నుండి 1,500 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో భౌగోళిక ఇబ్బందుల వల్ల పైప్లైన్ వేయడం అసాధ్యమని అంతా భావించారు.
అయితే, ఇంజినీర్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన దివ్య మిట్టల్.. ‘వాటర్ లిఫ్టింగ్ సిస్టమ్’ ద్వారా గ్రామానికి నీటిని మళ్లించారు. దాదాపు తొమ్మిది నెలల శ్రమ తర్వాత ‘హర్ ఘర్ జల్’ పథకం ద్వారా ఆ గ్రామంలోని ప్రతీ ఇంటికీ నల్లా నీరు అందింది. ఏడు దశాబ్దాలకు పైగా నీటి కోసం కష్టపడిన ఆ గ్రామానికి నల్లా ద్వారా నీరు రావడంతో గ్రామస్థులు భావోద్వేగానికి గురై ఆమెకు ఘన స్వాగతం పలికారు.
బదిలీ వివాదం.. అనుమానాల తెర వెనుక కథ
అయితే ఈ నీటి సరఫరా ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేళ ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యేను ఆహ్వానించలేదనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వ వర్గాల్లో ఇది పెద్ద దుమారమే రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమెను మిర్జాపూర్ నుంచి హఠాత్తుగా బదిలీ చేసి, కొంతకాలం వెయిటింగ్ లిస్ట్లో ఉంచారు. ఆ తర్వాత 2024లో దేవరియా కలెక్టర్గా, 2026 మే నెలలో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆమె బాధ్యతలు నిర్వర్తించారు.
రాజీనామా వెనుక అసలు కారణమేంటి?
తాజాగా దివ్య మిట్టల్ ఐఏఎస్కు రాజీనామా చేయడంతో, నాటి మిర్జాపూర్ నీటి ప్రాజెక్టు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. యోగీ సర్కార్ వేధింపుల వల్లే ఆమె రాజీనామా చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, ఆమె ఏర్పాటు చేసిన ఆ నీటి పైపులైన్లను కొందరు ధ్వంసం చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలపై ఎలాంటి అధికారిక స్పష్టత లేదు.
తన 13 ఏళ్ల ప్రయాణం ఎంతో సంతృప్తికరంగా సాగిందని, ఇది జీవితంలో మరచిపోలేని అనుభవమని దివ్య మిట్టల్ పేర్కొంటూ తన రాజీనామాను స్వచ్ఛంద నిర్ణయంగా ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ, ప్రజల కోసం నిజాయితీగా పనిచేసిన ఒక సమర్థవంతమైన మహిళా అధికారిణి రాజీనామా చేయడం ఇప్పుడు యూపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.