మాగుంటపై నోరుపారేసుకుంటే సహించేది లేదు
మాగుంటపై నోరుపారేసుకుంటే సహించేది లేదు
- వైసీపీ నేతల వ్యాఖ్యలపై శ్యామల కాశిరెడ్డి తీవ్ర ఆగ్రహం
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై వైసీపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజా సేవలో మూడు దశాబ్దాలుగా మాగుంట కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉందని అలాంటి కుటుంబంపై నోటికొచ్చినట్లు మాట్లాడటం వైసీపీ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
మాగుంట లిక్కర్ వ్యాపారం చేస్తున్నారని ఇప్పుడు విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు 2019లో మాగుంటకు తమ పార్టీ తరఫున టికెట్ ఇచ్చినప్పుడు ఈ విషయం తెలియదా అని శ్యామల కాశిరెడ్డి ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒకప్పుడు మాగుంటను అక్కున చేర్చుకుని ఇప్పుడు విమర్శలు చేయడం వైసీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని శ్యామల కాశిరెడ్డి హెచ్చరించారు. మాగుంటపై నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో మాగుంట కుటుంబం చేసిన సేవలను ప్రజలు మరచిపోలేదని స్పష్టం చేశారు.వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి మాగుంటను విమర్శించే నైతిక హక్కు లేదని శ్యామల కాశిరెడ్డి అన్నారు. మాగుంటపై విమర్శలు చేసే ముందు చెవిరెడ్డి తన రాజకీయ ప్రస్థానం గత వ్యవహారాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే తగిన స్థాయిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.