ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నినదిస్తే అరెస్టులా?
ఫీజు రీయింబర్స్మెంట్ సాధన కోసం వెనకడుగు వేసేది లేదు.
ప్రభుత్వ నియంతృత్వ వైఖరిపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ధ్వజం
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
రాష్ట్రంలోని లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న ఈ ప్రభుత్వం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగితే పోలీసులతో అణచివేసే ప్రయత్నం చేయడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ రోజు సెక్రటేరియట్ వద్ద శాంతియుతంగా సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థులు సంతకాలు చేసిన ప్రతులను అందించడానికి బీజేవైఎం నాయకులకు మద్దతుగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక శాసనసభాపక్ష నేత అని కూడా చూడకుండా పోలీసులు అక్రమంగా, అమానుషంగా ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస, నియంతృత్వ పాలనకు పరాకాష్టగా మారిందన్నారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే కనీసం స్పందించే తీరిక లేకపోవడం ఈ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం అని, ఒక ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా అరెస్టు చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న నియంతృత్వ, రాక్షస పాలనకు అద్దం పడుతోందన్నారు. పోలీసుల నిర్బంధాలు, అక్రమ అరెస్టులకు భయపడి విద్యార్థుల పక్షాన మేము చేసే పోరాటాన్ని ఆపేది లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే తన మొండి వైఖరిని వీడి, అరెస్టయిన మా నాయకులను బేషరతుగా విడుదల చేయాలనీ, అలాగే, పెండింగ్లో ఉన్న 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విద్యార్థులకు చెల్లించాలని లేనిపక్షంలో, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల పక్షాన ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.