ఆదిలాబాద్, మామ్నూర్ విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
తెలంగాణలో విమానానాయ రంగం విస్తరణ వేగవంతమవుతోంది. రాష్ట్రంలోని ప్రాంతీయ అనుసంధానతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన ఆదిలాబాద్ మరియు వరంగల్ మామ్నూర్ విమానాశ్రయాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. న్యూఢిల్లీలో పర్యటించిన సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో ఎయిర్పోర్టుల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. మామ్నూర్ విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్ నాటికి శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆదిలాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో సేవలు, ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్) సౌకర్యాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రన్వే స్పెక్సిఫికేషన్లపై రక్షణ మరియు పౌర విమానయాన శాఖల మధ్య సంయుక్త సమావేశం నిర్వహించాలని కోరడంతో ఈ ప్రాజెక్టులపై వేగం పెరిగింది. త్వరలోనే రాష్ట్రంలో విమానాశ్రయాల నిర్మాణం ఊపందుకునే అవకాశం ఉంది.