andhrapradesh
విద్యుత్ ప్లాంట్లను సిద్ధంగా ఉంచి నిరంతర విద్యుత్ అందించండి
విద్యుత్ ప్లాంట్లను సిద్ధంగా ఉంచి నిరంతర విద్యుత్ అందించండి
- 275 మిలియన్ యూనిట్లు దాటిన వినియోగం
-ఎల్నినో ఎఫెక్ట్ పెరిగిన కరెంట్ వినియోగం!
-15 రోజుల బొగ్గు నిల్వలు తప్పనిసరి
- థర్మల్, హైడల్ కేంద్రాల్లో సాంకేతిక లోపాలకు తావివ్వొద్దు
- అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశం
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పెరిగిన డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం విద్యుత్శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రస్తుత డిమాండ్, ఉత్పత్తి సామర్థ్యం, ప్లాంట్ల పనితీరు, భవిష్యత్తు అవసరాలపై మంత్రి సమీక్షించారు.ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడంతో గృహ, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ వినియోగం పెరిగిందని మంత్రి తెలిపారు. గతంలో రోజువారీ సగటు విద్యుత్ వినియోగం 218 మిలియన్ యూనిట్లుగా ఉండగా ప్రస్తుతం 275 మిలియన్ యూనిట్లకు పైగా చేరిందన్నారు. రానున్న రోజుల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.
అంతరాయాలకు తావివ్వొద్దు
డిమాండ్ పెరిగే సమయాల్లో ఎక్కడా విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తకుండా ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలను సమన్వయంతో నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. అన్ని రంగాల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని సరఫరా ప్రణాళికలు రూపొందించాలని, నిరంతర విద్యుత్ సరఫరాకు ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ప్లాంట్లలో లోపాలు వద్దు
థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని గొట్టిపాటి రవికుమార్ సూచించారు. పెరిగిన డిమాండ్కు అనుగుణంగా ప్లాంట్లను సిద్ధంగా ఉంచాలని, సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన మరమ్మతులు, నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
15 రోజుల బొగ్గు నిల్వలు
థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రతి ఉత్పత్తి ప్లాంట్లో కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. బొగ్గు సరఫరా, నిల్వలు, వినియోగంపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని సూచించారు.
పునరుత్పాదక విద్యుత్ పెంచాలి
రాష్ట్ర భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచాలని మంత్రి సూచించారు. సౌర, ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని మరింత మంది వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో విద్యుత్ డిమాండ్లో ఆకస్మిక పెరుగుదల వచ్చినా వ్యవస్థపై ఒత్తిడి పడకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని మంత్రి పేర్కొన్నారు. ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం, బొగ్గు నిల్వలు, సరఫరా వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను నిరంతరం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.సమీక్షా సమావేశంలో జెన్కో ఎండీ ఎస్.నాగలక్ష్మి, ట్రాన్స్కో జేఎండీ సూర్య సాయి ప్రవీణ్చంద్, పలువురు ఇంధనశాఖ అధికారులు పాల్గొన్నారు.